రాజస్థాన్లో వెలుగుచూసిన ఓ అమానుష ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. 13 ఏళ్ల మైనర్ బాలికను ఇంటి నుంచి మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన దుండగులు, ఆమెను ఓ హోటల్ యజమానికి విక్రయించడం.. అనంతరం ఐదు రోజుల పాటు ఒక హోటల్ నుంచి మరో హోటల్కు తరలిస్తూ 30 మందికి పైగా వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెలుగులోకి రావడం దేశాన్ని షాక్కు గురిచేసింది. బాధితురాలు చెప్పిన వివరాలు, పోలీసుల దర్యాప్తులో బయటపడిన విషయాలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలకు దిగడమే కాకుండా, కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హోటళ్లపై బుల్డోజర్ యాక్షన్ చేపట్టింది.
ఈ ఘటన రాజస్థాన్లోని శ్రీగంగానగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, జూన్ 18న ఇంటి నుంచి అదృశ్యమైన 13 ఏళ్ల బాలికను ఓ ఆటోడ్రైవర్ స్థానిక హోటల్ యజమానికి అప్పగించినట్లు దర్యాప్తులో తేలింది. అక్కడి నుంచి బాలికకు అసలు నరకం ప్రారంభమైంది. వివిధ హోటళ్ల యజమానులు, నిర్వాహకులు పరస్పర సహకారంతో ఆమెను ఐదు రోజుల పాటు వేర్వేరు హోటళ్లకు తరలిస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఎఫ్ఐఆర్లో నమోదైంది. ఈ ఘోరానికి కొందరు హోటల్ నిర్వాహకులు ప్రత్యక్షంగా సహకరించడమే కాకుండా, విషయం బయటకు రాకుండా ఆధారాలు చెరిపివేయడానికి కూడా ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
బాధిత బాలిక ఇచ్చిన వాంగ్మూలం కేసులో మరింత సంచలనంగా మారింది. నిరంతర అత్యాచారాల కారణంగా తీవ్ర నొప్పితో బాధపడుతూ ఏడుస్తుంటే, ఆమెను మౌనం పాటించేలా బలవంతంగా మద్యం తాగించేవారని పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఈ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే 12 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే శ్రీగంగానగర్ జిల్లాలో ప్రజలు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. నిందితులందరికీ ఉరిశిక్ష విధించాలని, ఈ నేరానికి వేదికగా మారిన అక్రమ హోటళ్లన్నింటినీ కూల్చివేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకున్న జిల్లా యంత్రాంగం, కేసుతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న నాలుగు హోటళ్లను బుల్డోజర్లతో కూల్చివేసింది. అక్రమ నిర్మాణాలపై కూడా ప్రత్యేక తనిఖీలు చేపట్టగా, జిల్లాలో వందకు పైగా అనుమానాస్పద హోటళ్ల కార్యకలాపాలపై విచారణ కొనసాగుతోంది.
ఈ ఘటన రాజకీయంగానూ పెద్ద దుమారమే రేపింది. స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ వైఫల్యాన్ని తీవ్రంగా విమర్శించారు. నిందితులతో పాటు వారికి సహకరించిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులపై కూడా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి త్వరితగతిన న్యాయం చేయడంతో పాటు ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అక్రమ హోటళ్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కేసుపై జిల్లా ఎస్పీ హరిశంకర్ స్పందిస్తూ.. దర్యాప్తు పూర్తిగా పారదర్శకంగా కొనసాగుతోందని, నిందితులు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. బాధితురాలికి అన్ని విధాలా వైద్య, మానసిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ప్రతి వ్యక్తిని గుర్తించి కఠిన శిక్ష పడేలా బలమైన ఆధారాలతో చార్జ్షీట్ దాఖలు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ ఘటన మరోసారి మహిళలు, చిన్నారుల భద్రతపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. నేరస్తులకు కఠిన శిక్షలు మాత్రమే కాకుండా, మానవ అక్రమ రవాణా, హోటళ్ల అక్రమ కార్యకలాపాలు, చిన్నారుల రక్షణ వ్యవస్థలపై మరింత పటిష్టమైన పర్యవేక్షణ అవసరమనే చర్చ మొదలైంది. బాధిత బాలికకు త్వరగా న్యాయం జరగాలని, ఇలాంటి అమానుష ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా పాలకులు, పోలీసులు, సమాజం సమిష్టిగా బాధ్యత వహించాలని దేశవ్యాప్తంగా ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply