మీరు పెట్రోల్ బంక్కు వెళ్లినప్పుడు E20 అనే పదం ఎప్పుడైనా గమనించారా? ఇటీవల సోషల్ మీడియాలో E20 పెట్రోల్పై ఎన్నో వార్తలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. “ఈ పెట్రోల్ వాడితే ఇంజిన్ పాడవుతుంది”, “మైలేజ్ తగ్గిపోతుంది”, “పాత బైక్లు, కార్లు దెబ్బతింటాయి”, “ఇన్సూరెన్స్ కూడా వర్తించదు” అంటూ అనేక ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ ప్రచారాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా 10 అంశాలతో కూడిన వివరణ విడుదల చేసింది. మరి, అసలు E20 అంటే ఏమిటి? దీనిపై ప్రభుత్వం ఏం చెబుతోంది? సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణల్లో నిజమెంత?
ముందుగా E20 అంటే ఏంటో తెలుసుకుందాం. సాధారణ పెట్రోల్లో 20 శాతం ఎథనాల్, 80 శాతం పెట్రోల్ కలిపితే దానిని E20 అంటారు. ఎథనాల్ అనేది చెరకు, మొక్కజొన్న, బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారయ్యే బయోఫ్యూయల్. ముడి చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, రైతులకు అదనపు ఆదాయం కల్పించడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఎథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అయితే, భారత్ ఇప్పటికే E20 లక్ష్యాన్ని చేరుకుంది.
కానీ, ఈ విధానం అమలులోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా E20 పెట్రోల్ వల్ల ఇంజిన్ దెబ్బతింటుందని, ఫ్యూయల్ పైపులు పాడవుతాయని, మైలేజ్ భారీగా తగ్గిపోతుందని, పాత వాహనాలకు ఇది ప్రమాదకరమని, ఎథనాల్ తయారీకి భారీగా నీరు వృథా అవుతోందని, అంతేకాదు ఇన్సూరెన్స్ క్లెయిమ్లు కూడా వర్తించవని ప్రచారం జరిగింది.
ఈ ప్రచారాలపై కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనేక వాదనలు శాస్త్రీయ ఆధారాలు లేనివని తెలిపింది. ప్రభుత్వం విడుదల చేసిన 10 పాయింట్ల వివరణలో మొదటగా ఇంజిన్ డ్యామేజ్ అంశాన్ని ప్రస్తావించింది. E20 వల్ల పెద్ద ఎత్తున ఇంజిన్లు పాడవుతున్నాయనే ఆరోపణలకు ఆధారాలు లేవని తెలిపింది. భారత ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ (ARAI) నిర్వహించిన పరీక్షల్లో కూడా ఎటువంటి ఇంజిన్ సమస్యలు బయటపడలేదని పేర్కొంది.
ఇక, మైలేజ్ విషయానికొస్తే… ఎథనాల్లో శక్తి సాంద్రత పెట్రోల్ కంటే కొద్దిగా తక్కువ. అందువల్ల స్వల్ప స్థాయిలో మైలేజ్ తగ్గే అవకాశం ఉంటుందని ప్రభుత్వం అంగీకరించింది. అయితే అది సాధారణ వినియోగంలో పెద్దగా గుర్తించలేనంత స్థాయిలోనే ఉంటుందని తెలిపింది. మరో వైరల్ ప్రచారం ఏమిటంటే… ఎథనాల్ ఎక్కువగా నీటిని పీల్చుకుంటుంది కాబట్టి ఇంధన ట్యాంకులో నీరు చేరి ఇంజిన్ దెబ్బతింటుందనేది. దీనిని కూడా ప్రభుత్వం ఖండించింది. ఆధునిక వాహనాల ఫ్యూయల్ సిస్టమ్లు, పెట్రోల్ బంక్ల నిల్వ వ్యవస్థలు ఈ సమస్య రాకుండా రూపొందించబడ్డాయని వివరించింది.
అదేవిధంగా, ఎథనాల్ తయారీ కోసం విపరీతంగా నీరు వాడుతున్నారన్న విమర్శలపై కూడా కేంద్రం స్పందించింది. చెరకు మాత్రమే కాకుండా బియ్యం, మొక్కజొన్న వంటి మిగులు పంటల నుంచీ కూడా ఎథనాల్ తయారు చేస్తున్నామని, అనేక ప్లాంట్లలో నీటి పునర్వినియోగ వ్యవస్థలు అమల్లో ఉన్నాయని తెలిపింది.
ఇంకో కీలక అంశం ఇన్సూరెన్స్. E20 పెట్రోల్ వాడితే ఇన్సూరెన్స్ క్లెయిమ్లు తిరస్కరిస్తారన్న ప్రచారాన్ని ప్రభుత్వం పూర్తిగా ఖండించింది. కేవలం E20 వాడినందుకే మోటార్ ఇన్సూరెన్స్ చెల్లదని చెప్పడం పూర్తిగా తప్పు అని స్పష్టం చేసింది. అయితే వాహన తయారీ సంస్థ సూచనలు పాటించడం ఎప్పుడూ మంచిదేనని కూడా సూచించింది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. అన్ని వాహనాలు ఒకేలా ఉండవు. 2023 తర్వాత తయారైన అనేక BS-6 ఫేజ్-2 వాహనాలు E20కు అనుకూలంగా రూపొందించబడ్డాయి. కానీ అంతకుముందు తయారైన కొన్ని వాహనాల విషయంలో ఆయా కంపెనీల ఓనర్ మాన్యువల్లో ఏమి సూచించారో పరిశీలించడం మంచిది.
మీ వాహనం E20 కంపాటిబుల్ కాదో తెలుసుకోవడానికి తయారీ సంస్థ వెబ్సైట్ లేదా అధికారిక సర్వీస్ సెంటర్ను సంప్రదించడం ఉత్తమ మార్గం. అయితే, ప్రభుత్వం మరో విషయాన్ని కూడా గుర్తు చేసింది. బ్రెజిల్, అమెరికా వంటి అనేక దేశాల్లో ఎథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ చాలా కాలంగా ఉపయోగిస్తున్నారని, భారత్ కూడా శుభ్రమైన ఇంధనాల వైపు అడుగులు వేస్తోందని తెలిపింది. ఎథనాల్ వినియోగం వల్ల ముడి చమురు దిగుమతులు తగ్గడంతో పాటు రైతులకు మార్కెట్ అవకాశాలు పెరుగుతాయని పేర్కొంది.
అయితే మరోవైపు కొంతమంది వాహనదారులు మైలేజ్ తగ్గడం లేదా పాత వాహనాల్లో పనితీరు మారిందంటూ తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఈ అంశంపై చర్చ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు అందుబాటులో ఉన్న శాస్త్రీయ అధ్యయనాలు, పరీక్షలు, అంతర్జాతీయ అనుభవం ఆధారంగా E20 కార్యక్రమం సురక్షితమేనని చెబుతోంది.
కాబట్టి సోషల్ మీడియాలో కనిపించే ప్రతి పోస్టును నమ్మే ముందు అధికారిక సమాచారం, వాహన తయారీ సంస్థ సూచనలు, విశ్వసనీయ వనరులను పరిశీలించడం అవసరం. మీ వాహనం E20కు అనుకూలమా కాదా అనేది తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. మొత్తంగా, ఇంధన మార్పులపై అవగాహన ఉంటేనే సరైన నిర్ణయం తీసుకోవచ్చు.

Leave a Reply