India First Hydrogen Train

భారతీయ రైల్వే చరిత్రలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఆవిరి ఇంజిన్లతో మొదలైన రైల్వే ప్రయాణం.. డీజిల్‌, విద్యుత్‌ రైళ్లను దాటి ఇప్పుడు హరిత ఇంధన యుగంలోకి అడుగుపెట్టింది. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ లక్ష్యంగా భారతీయ రైల్వే కీలక ముందడుగు వేసింది. దేశంలో తొలిసారిగా హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌ ఆధారిత రైలు పట్టాలపైకి వచ్చింది.

హరియాణాలోని జింద్‌-సోనిపట్‌ మార్గంలో ఈ హైడ్రోజన్‌ రైలును ప్రారంభించారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ రైలు.. భారత ఇంజినీరింగ్‌ సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న హైడ్రోజన్‌ రైలు సాంకేతికతను భారత్‌ కూడా సొంతం చేసుకుంది.

హైడ్రోజన్‌ రైలు ఎలా పనిచేస్తుంది?

ప్రస్తుతం దేశంలో నడుస్తున్న విద్యుత్‌ రైళ్లు ఓవర్‌హెడ్‌ విద్యుత్‌ లైన్ల ద్వారా శక్తిని పొందుతాయి. డీజిల్‌ రైళ్లు ఇంధనాన్ని మండించి శక్తిని ఉత్పత్తి చేస్తాయి. కానీ హైడ్రోజన్‌ రైలు మాత్రం పూర్తిగా భిన్నమైన విధానంలో పనిచేస్తుంది.

ఈ రైలు తనలో నిల్వ చేసుకున్న హైడ్రోజన్‌ ద్వారా స్వయంగా విద్యుత్‌ను తయారు చేసుకుంటుంది. దీనికి ప్రత్యేకంగా విద్యుత్‌ తీగలు అవసరం ఉండదు. అలాగే డీజిల్‌ ఇంధనంపై ఆధారపడాల్సిన అవసరం కూడా ఉండదు.

ఈ రైలులో ప్రధానంగా ప్రోటాన్‌ ఎక్స్‌ఛేంజ్‌ మెంబ్రేన్‌ ఫ్యూయల్‌ సెల్‌ (PEM Fuel Cell) సాంకేతికతను ఉపయోగించారు. అధిక పీడన ట్యాంకుల్లో నిల్వ చేసిన హైడ్రోజన్‌.. గాలిలోని ఆక్సిజన్‌తో రసాయన చర్య జరిపినప్పుడు విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. ఈ విద్యుత్‌ ట్రాక్షన్‌ మోటార్లకు చేరి రైలు చక్రాలను నడిపిస్తుంది.

ఈ ప్రక్రియలో ఇంధన దహనం ఉండదు. అందువల్ల పొగ, కార్బన్‌ ఉద్గారాలు వంటి కాలుష్య కారకాలు విడుదల కావు. ప్రధానంగా నీటి ఆవిరి, వేడి మాత్రమే బయటకు వస్తాయి.

అత్యాధునిక సామర్థ్యాలతో రూపకల్పన

భారత తొలి హైడ్రోజన్‌ రైలు అధునాతన సాంకేతికతతో రూపొందించబడింది. ఈ రైలులో రెండు వైపులా రెండు హైడ్రోజన్‌ పవర్‌ కార్లు ఉంటాయి. ఒక్కో పవర్‌ కారులో దాదాపు 1,200 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ఫ్యూయల్‌ సెల్‌ వ్యవస్థ ఉంటుంది.

మొత్తం ప్రొపల్షన్‌ సామర్థ్యం దాదాపు 3,200 హార్స్‌పవర్‌ వరకు ఉంటుంది. ఈ రైలు గరిష్ఠంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా డిజైన్‌ చేశారు. ప్రారంభ దశలో మాత్రం జింద్‌-సోనిపట్‌ మార్గంలో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో నడపనున్నారు.

ప్రపంచంలోనే ప్రత్యేకమైన ప్రయాణికుల సామర్థ్యం

హైడ్రోజన్‌ రైళ్లలో భారత్‌ మరో ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ప్రపంచంలోని చాలా హైడ్రోజన్‌ రైళ్లలో సాధారణంగా 2 నుంచి 4 కోచ్‌లు మాత్రమే ఉంటాయి. కానీ భారత హైడ్రోజన్‌ రైలులో మొత్తం 10 కోచ్‌లు ఉన్నాయి.

ఈ రైలులో దాదాపు 2,600 మంది ప్రయాణికులు ప్రయాణించే అవకాశం ఉంది. దీంతో అధిక ప్రయాణికుల సామర్థ్యం కలిగిన హైడ్రోజన్‌ ప్యాసింజర్‌ రైళ్లలో భారత్‌ ప్రత్యేక స్థానాన్ని సంపాదించనుంది.

కాలుష్యానికి చెక్‌ పెట్టే హరిత ప్రయాణం

సాధారణ డీజిల్‌ రైళ్లలో ఇంధనం మండటం వల్ల కార్బన్‌ ఉద్గారాలు, పొగ విడుదలవుతాయి. కానీ హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌ సాంకేతికతలో దహన ప్రక్రియ ఉండదు.

దీంతో వాయు కాలుష్యం తగ్గడమే కాకుండా శబ్ద కాలుష్యం కూడా తగ్గుతుంది. నెట్‌ జీరో కార్బన్‌ లక్ష్యాలను చేరుకునే దిశగా భారత రైల్వే చేపడుతున్న చర్యల్లో ఇది కీలక భాగంగా మారనుంది.

భద్రతకు ప్రత్యేక చర్యలు

హైడ్రోజన్‌ మండే స్వభావం కలిగిన గ్యాస్‌ కావడంతో ఈ రైలులో భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. హైడ్రోజన్‌ లీకేజీలు, అధిక ఉష్ణోగ్రతలు, మంటలను గుర్తించే ప్రత్యేక సెన్సార్‌ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.

ఏదైనా ప్రమాద సూచన కనిపిస్తే ఆటోమేటిక్‌ షట్‌ఆఫ్‌ సిస్టమ్‌ పనిచేసి హైడ్రోజన్‌ సరఫరాను నిలిపివేస్తుంది. అలాగే రైలులో నిరంతర వెంటిలేషన్‌ వ్యవస్థ ఉంటుంది.

ఈ రైలు నిర్వహణ కోసం హరియాణాలోని జింద్‌లో ప్రత్యేక హైడ్రోజన్‌ రీఫ్యూయలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ హైడ్రోజన్‌ ఉత్పత్తి, నిల్వ, కంప్రెషన్‌, రైలుకు నింపే ప్రక్రియలు జరుగుతాయి. ఈ కేంద్రంలో దాదాపు 3,000 కిలోల హైడ్రోజన్‌ను నిల్వ చేసే సామర్థ్యం ఉంటుంది.

భవిష్యత్‌లో మరిన్ని మార్గాల్లో హైడ్రోజన్‌ రైళ్లు

ప్రస్తుతం ఈ హైడ్రోజన్‌ రైలు ఉత్తర రైల్వే పరిధిలోని జింద్‌-సోనిపట్‌ మార్గంలో నడుస్తుంది. దాదాపు 89 కిలోమీటర్ల దూరాన్ని కవర్‌ చేస్తూ పలు స్టేషన్లలో ఆగుతుంది.

భవిష్యత్‌లో కల్కా-షిమ్లా వంటి వారసత్వ రైల్వే మార్గాల్లో కూడా హైడ్రోజన్‌ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశాలను భారతీయ రైల్వే పరిశీలిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, జపాన్‌, చైనా వంటి దేశాలు ఇప్పటికే హైడ్రోజన్‌ రైళ్లను వినియోగిస్తున్నాయి. అయితే భారత్‌ ప్రత్యేకత ఏమిటంటే.. పెద్ద ప్రయాణికుల సామర్థ్యంతో, స్వదేశీ సాంకేతికత ఆధారంగా ఈ రైలును అభివృద్ధి చేయడం.

ఆవిరి ఇంజిన్ల నుంచి డీజిల్‌ వరకు.. డీజిల్‌ నుంచి విద్యుత్‌ వరకు సాగిన భారతీయ రైల్వే ప్రయాణం ఇప్పుడు హైడ్రోజన్‌ యుగంలోకి అడుగుపెట్టింది. ఇది కేవలం కొత్త రైలు ప్రారంభం మాత్రమే కాదు.. కాలుష్యాన్ని తగ్గించే, పర్యావరణానికి అనుకూలమైన భవిష్యత్‌ రవాణా వ్యవస్థకు ఇది తొలి అడుగు. భారత రైల్వే స్వచ్ఛ ఇంధన ప్రయాణంలో హైడ్రోజన్‌ రైలు ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.

భారతీయ రైల్వేలో కీలక ముందడుగు
రైల్వేలో కొత్త శకం ఆరంభం
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు!
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌లతో పరుగులు
పొగ లేదు.. కాలుష్యం లేదు..!
విదేశాల్లో నడుస్తున్న హైడ్రోజన్ రైళ్ల కంటే పెద్దది
స్వదేశీ సాంకేతికతతో హైడ్రోజన్ రైలు
గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం
రైలులో మొత్తం 10 కోచ్‌లు..
దాదాపు 2,600 మంది ప్రయాణం..
3,000 కిలోల హైడ్రోజన్‌ను నిల్వ చేసే సామర్థ్యం



Leave a Reply

Your email address will not be published.