మనిషి ఒక కర్మజీవి మరియు ఇది కర్మభూమి అంటారు. ఇదేంటి ఇలా చెబుతుంది అని ఇదేదో అర్థం కాని వేదాంతం అనుకోవద్దు. పని వల్ల పుట్టిన ఈ శరీరం పని లేకుండా క్షణం కూడా ఉండదు. అలా చేసిన పనుల ఫలితంగా జన్మించిన మనం, ఆయా పనులను ముగించుకుని ఈ లోకం నుంచి వెళ్లడం కూడా అంతే అనివార్యం. ఇదే ఈ సృష్టి యొక్క అసలైన నియమం. ఇందుకోసమే మన జీవితం ఏర్పడిందనిపించినా, మానవ జన్మ యొక్క అసలైన లక్ష్యం మాత్రం అది కానే కాదు.
శాస్త్రాల అసలు లక్ష్యం ఏమిటి?
మనిషికి మరణమే లేదని చెప్పే అద్భుతమైన విజ్ఞాన వైభవమే మన శాస్త్రాల లక్ష్యం. ఈ సత్యం అంత తొందరగా ఎవరికీ అర్థం కాదు; దీనికోసం జీవితం పరిపక్వత చెందాలి.
ఇవన్నీ వ్యక్తికి భౌతికంగా మరియు అనుభవపూర్వకంగా అందించడానికే ఎన్నో శాస్త్రాలు పుట్టాయి. శాస్త్రం ఉన్నది కేవలం జీవికి సరైన గమ్యాన్ని తెలపడానికే. శాస్త్రం చెప్పిన మార్గంలో కొన్ని నియమాలు పాటిస్తూ వెళ్తేనే జీవితం యొక్క అసలైన పరమార్థం మనకు అర్థమవుతుంది.
తల్లి తన బిడ్డకు కారం పెట్టినా, చేదు మందు ఇచ్చినా, బుజ్జగించినా లేదా చెంప పగలగొట్టినా.. ఆ వెనుక బిడ్డ భద్రత ఒక్కటే ఎలా ఉంటుందో, అందరినీ వారి సరైన గమ్యాలకు చేర్చేదే మన తత్వశాస్త్రం.
మరణం అనేది ఏ జీవికీ అంతం కాదు, అది కేవలం మరో ఆరంభానికి తాత్కాలిక విరామం మాత్రమే!

Leave a Reply