జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు తన సోదరుడు బలరాముడు సోదరి సుభద్ర తో కలిసి కొలువుదీరిన మహిమాన్విత క్షేత్రమే పూరి జగన్నాథ ఆలయం. ఆషాడశుద్ధ విదియ నాడు ఇక్కడ రథయాత్ర ప్రారంభమవుతుంది. కానీ అంతకు రెండు రోజుల ముందు జేష్ట మాసంలో వచ్చే పౌర్ణమి నాడు స్నానయాత్ర నిర్వహిస్తారు. తర్వాత స్వామికి అనారోగ్యం అని ప్రకటించి విశ్రాంతి పేరుతో రహస్య మందిరానికి తరలిస్తారు. రహస్య మందిరం నుంచి బయటకు వచ్చిన రోజే రథయాత్ర ప్రారంభం. మూడు రథాలలో స్వామి సుభద్ర బలభద్రులు గుండిచాకు చేరుకుంటారు. స్వామివారు అక్కడ ఆతిధ్యం స్వీకరించిన తర్వాత దశమినాడు తిరుగు ప్రయాణం అవడంతో యాత్ర ముగుస్తుంది. ఎంతో ప్రాముఖ్యత పొందిన ఈ ఆలయం లో సైన్స్ కు కూడా అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. ఇంతకీ ఆ రహస్యాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
మొదటి అద్భుతం..ఆలయంపై జెండాలు గాలికి వ్యతిరేక దిశలో ఎగరడం :
పూరీ జగన్నాధ్ ఆలయంపై ఎప్పుడూ హిందూ మతం చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి. ఇందులో ఆశ్చర్యం ఏం ఉంది అనుకోకండి. అసలు రహస్యం ఇక్కడే ఉంది. ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి. దీని వెనుక రహస్యం శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు.
రెండో అద్భుతం ఆలయంలోని విగ్రహాలు :
సాధారణంగా ఆలయాలలో రాతి లేక ఇత్తడి విగ్రహాలు ఉంటే ఈ గుడిలోని శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ విగ్రహాలను చెక్కతో తయారు చేశారు.
ఇక మూడో మిస్టరీ ఈ ఆలయం పైనున్న సుదర్శన చక్రం..:
ఇది 20 అడుగుల ఎత్తు, టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరీ జగన్నాధ్ ఆలయ పై భాగాన ఏర్పాటు చేశారు. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే పూరీ పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది. ఆలయంపైన ఈ చక్రాన్ని ఉంచిన తీరు ఒక ఇంజినీరింగ్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఏ వైపు నుంచి మీరు దీనిని చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్లు కనిపించడం విశేషం.
నాలుగో రహస్యం ఈ ఆలయంపై పక్షులు ఎగరకపోవడం..:
ఈ ఆలయంపై నుంచి విమానాలు, పక్షులు ఎగరకపోవడం చాలా ఆశ్చర్యకర విషయం. దేశంలోని ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం కనిపించడం అరుదు. ఏ ప్రభుత్వమూ దీనిని నో ప్లయింగ్ జోన్ గా ప్రకటించలేదు. ఏదో తెలియని అతీత శక్తి కారణంగా ఇది నో ఫ్లయింగ్ జోన్ గా పరిగణింపబడుతుంది. దీనికి ఇప్పటికీ శాస్త్రీయ వివరణ లేకపోవడంతో రహస్యంగానే మిగిలిపోయింది.
ఐదో అద్భుతం..ఆలయ నిర్మాణం :
పూరీ జగన్నాధ్ ఆలయాన్ని ఓ అద్భుతంగా చెప్పవచ్చు. రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయ గోపురం నీడ ఎవ్వరికీ కనిపించదు. ఇది అప్పటి ఇంజినీరింగ్ అద్భుతమా లేక దైవ శక్తి కారణంగా జరుగుతుందా అనేది అంతుచిక్కని విషయం.
ఆరవ మరో అద్భుత విషయం..సింఘద్వారం రహస్యం:
జగన్నాధ్ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి. వీటిలో సింఘ ద్వారం ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గం. ఈ ద్వారం గుండా ఆలయంలో ప్రవేశించినప్పుడు మీరు శబ్ధ తరంగాలను స్పష్టంగా వినవచ్చు. ద్వారం నుంచి కాస్త వెనక్కి నడిచి బయటకు వస్తే ఆ శబ్ధం మీకు వినిపించదు. ఇది భక్తులకు ఓ అద్భుతంలా అనిపిస్తుంది.
ఏడవది..సముద్రం రహస్యం..:
సాధారణంగా సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపు, సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు వీస్తుంది. కానీ పూరీ సముద్ర తీరంలో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేక దిశలో జరగడం విశేషం. ఇది సైన్స్ కు కూడా అంతుచిక్కని మిస్టరీ.
ఎనిమిదవ అద్భుత రహస్యం.. 1800 ఏళ్ల నుంచి జరుగుతున్నఒక ఆచారం:
45 అంతస్తుల ఎత్తు గల ఈ ఆలయంపైకి ప్రతి రోజూ ఓ పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తుంటారు. ఈ ఆచారం దాదాపు 1800 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఇది ఒక్క రోజు తప్పినా అప్పటి నుంచి 18 ఏళ్ల వరకూ ఆలయం మూతపడుతుందని నమ్ముతారు. కానీ ఇప్పటివరకు అలా ఎప్పుడూ జరగలేదు.
అన్నింటికీ మించిన తొమ్మిదవ అద్భుతం.. ప్రసాదం రహస్యం:
పూరీ జగన్నాధ్ ఆలయానికి వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రతి రోజూ 2000 నుంచి 20,000 వరకూ భక్తులు వస్తుంటారు. అయితే ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తుంటారు. కానీ ఎప్పుడు కూడా ప్రసాదం వృధా కావడం, భక్తులకు సరిపోకపోవడం చోటుచేసుకోకపోవడం ఆశ్చర్యకర విషయం. ఈ ప్రసాదాన్ని ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పై భాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం విశేషం.

Leave a Reply